చక్కబడుతున్న భూగర్భగని
Published Tuesday, 26 July 2016కొత్తగూడెం, జూలై 25: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె-5ఇంక్లైన్ భూగర్భగనిలో రెండువారాలు శ్రమించిన ఫలితంగా విష వాయువుల లీకేజీ అదుపులోకి వచ్చింది. సోమవారం భూగర్భగనిలో సీల్వాల్స్ నిర్మించడానికి అవసరమైన మెటీరియల్ను పంపిస్తున్నారు. మొత్తం 700 మంది కార్మికులను డిప్యుటేషన్పై జెవిఆర్, జికెఓసి, ఓపెన్కాస్టులతో పాటు ఆర్సిహెచ్పి, వికె-7ఇంక్లైన్, మణుగూరు, ఇల్లెందు ఏరియాలకు డెప్యూటేషన్లపై పంపించిన విషయం విదితమే. మిగిలిన 400 మంది కార్మికులను గని వద్ద నిర్వహిస్తున్న మరమ్మతు చర్యలకు వినియోగిస్తున్నారు. అయితే కార్బన్డయాక్సైడ్ పంపిన ఫలితంగా గనిలో విష వాయువుల లీకేజీ అదుపులోకి వచ్చింది. రెస్క్యూటీం తీసుకువచ్చిన శాంపిల్స్ను టెస్ట్కు పంపించి నిర్ధారణ జరిగిన తరువాత సోమవారం ఆర్సిహెచ్పికి డెప్యూటేషన్పై కేటాయించిన 87మంది కార్మికులను తిరిగి గనికి రప్పించారు. వారిని భూగర్భ గనిలో సీల్వాల్స్ నిర్మించడానికి ఉపయోగించే మెటీరియల్ను తీసుకువెళ్ళే పనులను అప్పగించారు. పూణె నుండి అత్యాధునిక కాంక్రీట్ మిషన్ కూడా సీల్వాల్ నిర్మాణం కోసం అధికారులు తెప్పించారు. మరో ఐదారురోజుల పాటు పనులు జరగనున్నాయి.