ఆగస్టు నుంచే కేంద్ర సిబ్బందికి కొత్త జీతాలు
Published Tuesday, 26 July 2016న్యూఢిల్లీ, జూలై 25: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ, పెన్షనర్లకు జీతాలు పెంచుతూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు ఆగస్టు నెల నుంచే అమలులోకి అమలులోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ వారంలోనే నోటిఫికేషన్ రావచ్చునని తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. దాదాపు 4.8 మిలియన్ల మంది ఉద్యోగులు, అలాగే 5.2 మిలియన్ల మంది పెన్షనర్లకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని నోటిఫికేషన్తో పెరిగిన జీతాల అమలుకు సుగమం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే అలవెన్సులకు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సారథ్యంలోని కమిటీకి నివేదించారు. 4నెలల వ్యవధిలో ఈ కమిటీ తన సిఫార్సులను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ ప్రస్తుత అలవెన్సులే అమలులో ఉంటాయని చెబుతున్నారు. మామూలుగా కేబినెట్ నిర్ణయం తీసుకున్న 15-20 రోజులలోగా గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది.