S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తీరంలో దాహం కేకలు!

కృత్తివెన్ను, జూలై 25: చెదురుమొదురుగా వర్షాలు కురుస్తున్నా, పంట కాలువలకు అరకొరగా నీరు వస్తున్నా తీరప్రాంతంలో దాహం కేకలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మండల పరిధిలోని పలు గ్రామాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన గరిశపూడి, మాట్లం, లక్ష్మీపురం, పల్లెపాలెం గ్రామాల ప్రజలకు రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మే నెలలో ఇంటి అవసరాలతో పాటు వాడుక అవసరాలకు నీటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. పాలకులు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మండలానికి తీసుకువచ్చామని చెప్పటం తప్ప ప్రజల దాహార్తిని తీర్చలేని పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. గత రెండు సంవత్సరాల నుండి పంచాయతీలలో ఉన్న ఊర చెరువులు, మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపిన దాఖలాలు లేవు. దిగువ గ్రామాల రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా కనీసం తాగటానికైనా గుక్కెడు మంచినీరు ఇచ్చేలా చర్యలు తీసుకునే ఆలోచన కూడా పాలకులకు లేకపోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. పెడన శాసనసభ్యులు కాగిత వెంకట్రావు పట్టిసీమ ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తీసుకొచ్చామని, ఖరీఫ్ పంటకు నీరు అందిస్తామని చెప్పి కాలువలకు నీరు విడుదల చేశారు. ఆ నీరు ఒకరోజు మాత్రమే పంట కాలువలో కనిపించింది. మరుసటి రోజున పంట కాలువలో చుక్కనీరు కూడా లేదు. మండల ప్రజల దాహార్తిని తీర్చడానికి సీతనపల్లిలో ఏర్పాటు చేసిన మేగా రక్షిత మంచినీటి పథకం 50 ఎకరాల చెరువు ఉన్నా లేనట్లే. మండల పరిధిలో 16 పంచాయతీలలో ఉన్న ప్రజలకు తాగునీరు అందించేలా ఏర్పాటు చేసిన చెరువు నీరు లేక గడ్డి, చెత్తతో వెలవెలబోతోంది. ఈ పరిస్థితుల్లో దిగువ గ్రామాల ప్రజానీకానికి తాగునీరు అందించలేని పాలకులు సాగు నీరు ఎలా ఇస్తారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ సంవత్సరం అయినా పూర్తిస్థాయిలో పంచాయతీ చెరువులలో నీటిని నింపి దిగువ గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రజలు ఆవేదనతో వేడుకుంటున్నారు.
ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సిఎం
కంచికచర్ల, జూలై 25: రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ కాపుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ రుణ మేళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి ఉమ మాట్లాడుతూ అన్ని వర్గాల్లోని పేదల అభ్యున్నతి కోసం సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిధులను కేటాయించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు, పార్టీ కార్యకర్తలకు బీమా పథకాన్ని వర్తింపజేశారన్నారు. పెన్షన్ల కింద 45 లక్షల మందికి 6 వేల కోట్లు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు కాపు కార్పొరేషన్ ద్వారా కంచికచర్ల మండలంలో 326 మందికి రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ రుణాలను సద్వినియోగపర్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా 70మంది లబ్ధిదారులకు రుణాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి వేల్పుల ప్రశాంతి, జడ్‌పిటిసి కోగంటి బాబు, ఎఎంసి చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్వర్, కాపు నాయకులు డాక్టర్ పులగూర ప్రభాకరరావు, వేమా వెంకట్రావు, నంబూరి నాగేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అల్లాడి కోటేశ్వరరావు, విజయవాడ మాజీ కార్పొరేటర్ కోగంటి రామారావు, తహశీల్దార్ ఉదయభాస్కర్, ఎండిఒ కొడాలి అనురాధ, మహిళా నాయకులు చంద్రకళ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.