ఐటి ఉద్యోగుల్లో టిసిఎస్ టాప్
Published Tuesday, 26 July 2016న్యూఢిల్లీ, జూలై 25: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. భారతీయ ఐటి పరిశ్రమలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్జెమినీ సంస్థలున్నట్లు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది. గత నెల జూన్ నాటికి టిసిఎస్లో ఉద్యోగులు 3.62 లక్షలుగా ఉంటే, ఇన్ఫోసిస్లో 1.97 లక్షలు, విప్రోలో 1.73 లక్షల ఉద్యోగులున్నారు. టాప్-10లోని మిగతా సంస్థల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, జెన్పాక్ట్, ఇంటెలెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజిస్ సంస్థలున్నాయి. ఇక టాప్-20లో మలి పది సంస్థల విషయానికొస్తే హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సిఎస్సి ఇండియా, డబ్ల్యుఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఇఎక్స్ఎల్, ఎల్అండ్టి ఇన్ఫోటెక్, ఫస్ట్సోర్స్ సొల్యుషన్స్, మిండ్ట్రీ, సిజిఐ సంస్థలున్నాయి. కాగా, కాగ్నిజెంట్ అమెరికాకు చెందిన సంస్థే అయినప్పటికీ భారత్లో అత్యధిక స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉంది. ఇదిలావుంటే భారతీయ ఐటి-బిపిఎమ్ పరిశ్రమ ఉద్యోగుల సంఖ్య 37 లక్షలను సమీపించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లోనే 2 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. నాస్కామ్ నివేదిక ప్రకారం గడచిన ఐదు సంవత్సరాలను తీసుకుంటే పరిశ్రమలోకి కొత్తగా 11 లక్షల మంది ఉద్యోగులు వచ్చారు. ఇక మొత్తం భారత ఐటి పరిశ్రమలో మహిళా ఉద్యోగులు 13 లక్షలుగా ఉన్నారు.