నర్సింగ్ యాదవ్ వివాదం దురదృష్టకరం
Published Tuesday, 26 July 2016న్యూఢిల్లీ, జూలై 25: రియో ఒలింపిక్స్లో పాల్గొనాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ను డోపింగ్ కుంభకోణం చుట్టుముట్టడం ‘దురదృష్టకరమని’ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన అతని సహచర రెజ్లర్ సుశీల్ కుమార్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. సుశీల్ కుమార్ను పక్కకు నెట్టి నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్కు ఎంపికైన విషయం విదితమే. అయితే రియో ఒలింపిక్స్లో పాల్గొనకుండా నర్సింగ్ను దెబ్బతీసేలా ప్రస్తుతం అతని చుట్టూ నెలకొన్న వివాదంపై సుశీల్ కుమార్ స్పందిస్తూ, సహచర రెజ్లర్లకు ఎప్పుడూ బాసటగా ఉంటానని స్పష్టం చేశాడు. ‘నర్సింగ్ చుట్టూ నెలకొన్న వివాదం తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది. సహచర రెజర్లకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని సుశీల్ కుమార్ ట్విట్టర్లో పోస్టు చేసిన దాదాపు 20 సెకన్ల వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఒలింపిక్స్లో దేశానికి మూడో పతకాన్ని అందించాలని ఆకాంక్షించానని, అయితే గత నెల రోజుల నుంచి ఒలింపిక్ సన్నాహాలకు దూరంగా ఉన్న తాను సహచర రెజ్లర్లు దేశానికి పతకాన్ని తీసుకురావాలని ఆశిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నానని సుశీల్ కుమార్ ఆ సందేశంలో తెలిపాడు.
చిత్రం.. సుశీల్ కుమార్