ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు
Published Tuesday, 26 July 2016విజయనగరం(టౌన్), జూలై 25 : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. గడపగడపకు పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 12వ వార్డు, మండలంలోని గుంకలాం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా బ్యాలెట్ను ప్రజలకు అందజేసారు. రెండేళ్ల తెలుగు దేశం పాలన తీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు హామీలు అమలు చేయడంలో బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. ఫలితంగా చంద్రబాబు మాటలునమ్మి ఓటువేసిన ఆయా వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి సిఎంగా రావాలని ఆశిస్తున్నారని తెలిపారు. ఈ రెండేళ్లల్లోనే ప్రజలు వాస్తవాలు గ్రహించారని త్వరలోనే బుద్ధి చెబుతారని చెప్పారు. ఈ పర్యటనలో పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, పార్టీ నాయకులు అప్పారావు, షకీల్,షబ్బీర్, కిషోర్, బోగి రమణ, బంగారునాయుడు, బొద్దాన అప్పారావు, చాణిక్య తదితరులు పాల్గొన్నారు.