ఉద్యమంలా మొక్కలు నాటండి
Published Tuesday, 26 July 2016శ్రీకాకుళం, జూలై 25: వాతావరణం సమతుల్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా మొక్కలు నాటేకార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కార్మికశాఖామంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 29న వనమహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం కాగాలదని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వనమహోత్సవ కార్యక్రమం జిల్లాలో నిర్వహించాలనే సంకల్పించినట్టు తెలిపారు. జీవకోటి ప్రాణుల మనుగడకు వనాలు ఎంతో అవసరమన్నారు. దీనిని ప్రజలు సామాజిక బాధ్యతగా స్వీకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతీ పౌరుడు ఓ మొక్కను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా స్వీకరించి మరింత బాధ్యతతో
వ్యవహరించినట్లయితే తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. భావితరాల కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించగలిగితే సత్ఫలితాలు సాధించడం సులువవుతుందన్నారు. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వకార్యాలయాలతోపాటు, పరిశ్రమల, తదితర సంస్థల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగి వన మహోత్సవ లక్ష్యాన్ని అధిగమించడంలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.