బాబు పాలనలో కష్టాలు
Published Tuesday, 26 July 2016ఎచ్చెర్ల, జూలై 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలను పక్కన పెట్టి బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందని విధంగా పాలన సాగిస్తున్నారని వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లె కిరణ్కుమార్ విమర్శించారు. సోమవారం సాయంత్రం బడివానిపేట పంచాయితీలో గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. మత్స్యకారులకు ఎటువంటి అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేయడంలేదని ఉపాధి లేక వలసలు కొనసాగుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హుదూద్ వంటి తుఫాన్లో నష్టపోయిన మత్స్యకారులను ఇప్పటికీ ఆదుకోవడంలో అలసత్వం వహిస్తుందన్నారు. సామాన్యుల ఇబ్బందులను పక్కన పెట్టి కార్పొరేట్ రంగానికే తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేయడంతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, రేషన్కార్డులు, పింఛన్లు లేక అనేక మంది నిరుపేదలు ఇబ్బందులకు గురౌతున్నా తెలుగుదేశం నేతలు నీరు-చెట్టు పేరిట ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టకుండా నిధులు మింగేస్తున్నారని ఆయన ఆరోపించారు. హామీల కరపత్రంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీఅధ్యక్షులు సనపల నారాయణరావు, ఎం.మురళీదరబాబా, డొంక అప్పలరాజు, మూగి శ్రీరాములు, కళ్లేపల్లి తిరుపతిరావు, బొడ్డేపల్లి సుధాకర్, నేతింటి నీలం, జరుగుళ్ల శంకరరావు, నక్క కృష్ణమూర్తి, పైడి భాస్కరరావు, అల్లు సూర్యనారాయణ, కన్నప్పడు, తదితరులు ఉన్నారు.