రంగసాయి ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి సురభి నాటకాలు
Published Tuesday, 26 July 2016ఆరిలోవ, జూలై 25: నగరానికి చెందిన రంగసాయి నటక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 3,4,5 తేదీలలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సురభి నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాదంగీర్ సాయి ( ఎ.వి.వి. ఎస్.మూర్తి) తెలిపారు. తెలుగు నాటక రంగంలో సుదీర్ఘంగా 131 వసంతాల చరిత గల సురభి నాటకాలు విశాఖ ప్రజలకు, నాటక ప్రియులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన సురభి శ్రీ వేంకటేశ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఆర్.నాగేశ్వరరావు(సురభి బాబ్జీ) దర్శకత్వంలో ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఆగస్టు 3న అద్భుత పౌరాణిక నాటకం ‘మాయాబజార్’ ఆగస్టు 4న మరో గొప్ప జానపద నాటకం ‘పాతాళభైరవి’ ఆగస్టు 5న తొలిరోజు నాటిక, మాయాబజార్ నాటకాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. సుమారు 70 మంది కళాకారులు నాటక ప్రదర్శనల్లో పాల్గొంటారన్నారు. నాటక ప్రదర్శనలు తిలకించడానికి రూ. 300లు, రూ. 200లు, రూ. 100లు డోనర్ పాసులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డోనర్ పాసులు అడ్వాన్సు బుకింగ్ చేసుకోదలచిన వారు ‘దసపల్లా ఇన్ గేట్ పక్కన ’ సాయి బాదంగీర్ షాపులో, కళాభారతి ఎదురుగా వున్న శ్రీ ఫొటో స్టూడియోలో, దొండపర్తిలోని రాజమండ్రి శారీ మందిర్లో, జగదాంబ జంక్షన్ వద్ద యల్లమ్మ గుడి పక్కన గల బాబా జెరాక్స్ షాపులో సంప్రదించాలని తెలిపారు. కళాశాల, పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల కోసం ఈ మూడు రోజులు ఉదయం లేదా మధ్యాహ్నం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని బాదంగీర్సాయి తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకొని, కళాకారులను ప్రోత్సహించాలని సాయి కోరారు.