కాంగ్రెస్ నేతల అరెస్టు: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
Published Tuesday, 26 July 2016హైదరాబాద్: నిర్వాసిత రైతులపై లాఠీచార్జికి నిరసనగా ‘చలో మల్లన్నసాగర్’ యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో మంగళవారం ఉదయం నగరంలోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలను బయటికి వెళ్లనీయకుండా పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. మల్లన్నసాగర్ యాత్ర సందర్భంగా మెదక్ జిల్లాకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు బయటకు రావడంతో పోలీసులు అరెస్టులు చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రైతులను పరామర్శించేందుకు వెళుతుండగా తమను అరెస్టు చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తమను అక్రమంగా నిర్బంధించినప్పటికీ యాత్ర ఆగేది లేదన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి తదితరులు గాంధీభవన్కు చేరుకున్నారు.