కణాల్లో మార్పులు క్యాన్సర్కు మూలం
Published Tuesday, 26 July 2016శరీరం కణాలతో నిర్మితమై ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ కణాలు ప్రతి ఆరు నెలలకు చనిపోయి కొత్త కణాలు పుడుతుంటాయి. కొత్త కణాలు అన్నివిధాలా పాత కణాలలాగే ఉండాలి. అలా కాకుండా మ్యుటేషన్స్ వచ్చి కణాలలో మార్పు వస్తే దానిని క్యాన్సర్ అంటారు.
మన శరీరంలో రకరకాల కణాలుంటాయి. నరాల కణాలు శరీరం నుంచి మెదడుకి, మెదడునుంచి శరీరానికి సంకేతాలు పంపుతుంటాయి. రక్తకణాలు- ఇవి రక్తంలో ఆక్సిజన్ ఆహారం తీసుకువెళ్ళడానికి తోడ్పడతాయి. కండర కణాలు - శరీర కదలికలకు కండరాల ద్వారా తోడ్పడతాయి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలకు తోడ్పడడానికి రకరకాల కణాలుంటాయి. అందుకని ఒక్కో రకం కణాలు ఒక్కోరకం పనులు చేయడానికి ఒక్కో రకం నిర్మాణం కలిగి ఉంటాయి. ఇవి మార్పు చెందడానే్న క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ కణాలు తమ పద్ధతిని మార్చుకుని తెగ ఉత్పత్తి అవుతుంటాయి.
అవి పెరిగినకొద్దీ పెద్ద గడ్డలా తయారవుతుంది. దీనిని ప్రాథమిక దశ అంటారు. ఆ తర్వాత ఇవి శరీరంలోని ఇతర అవయవాలకి రక్తం ద్వారా చేరతాయి. దీనిని ‘సెకండరీస్’ అంటారు. క్యాన్సర్ తీవ్రమైందన్నమాట. ఆ కణాలు ఎక్కడెక్కడకు వెళ్తాయో పసిగట్టి చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది ప్రాణాంతక దశ, ఈ రకం ట్యూమర్స్ని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. రెండో రకం ‘బినైన్ ట్యూమర్’. ఇది ఒక చోట నుంచి మరో చోటికి పోవు. ఒక చోటే పెరిగి పెద్ద గడ్డలా కనిపిస్తుంటుంది. దీనివల్ల ప్రాణాపాయం ఉండదు. మెదడు పుర్రెలో వుంటుంది. దాంట్లో బినైన్ ట్యూమర్ వచ్చినా కష్టం. ఎందుకంటే పుర్రెలో ఉండే స్థలం తక్కువ. పెరిగినకొద్దీ అవి మెదడు పదార్థాన్ని ప్రక్కకి తోసి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే శరీరంలో ఎక్కడ గడ్డల్లా వస్తున్నా జాగ్రత్త పడాలి. పుట్టుమచ్చలు లాంటివి పెరగకుండా చూసుకోవాలి. ఆడవాళ్ళు స్నానం చేసేప్పుడు రొమ్ముల్ని తడుముకుని స్నానం చేస్తుండాలి. గడ్డలా అనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి కలవాలి.