హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి
Published Wednesday, 27 July 2016మేడ్చల్, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో విధిగా అందరూ భాగస్వామలు కావాలని తహశీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపిడిఓ దేవసహాయం, ఎంఇఓ బి. శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కండ్లకోయ అనుబంధ గ్రామమైన సుత్తారిగూడలో సర్పంచ్ కందాడి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామచెరువులో అధికారులు, నాయకులు, విద్యార్థులు స్థానికులతో కలిసి విరివిగా మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అధికారులు మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని పచ్చదనం పరిఢవిల్లితేనే అందరూ కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత కోసం, కాలుష్య నివారణను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సిఎం కెసిఆర్ భవిష్యత్తు తరాలు ఆనందమయ జీవితం గడపాలని ముందుచూపుతో బృహత్తరమైన హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అడవుల శాతం తగ్గుముఖం పట్టడంతో గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కరవుకాటకాలతో సతమతమవుతున్నామని పచ్చదనం ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురిసి అందరం ఆనందంగా ఉంటామని వారు వివరించారు. ప్రతిఒక్కరూ తమతమ ఇళ్ల వద్ద మొక్కలను నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడాలని దీనిని గురుతరమైన బాధ్యతగా భావించాలని కోరారు. కార్యదర్శి చంద్రప్రకాశ్రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్, పిఎసిఎస్ డైరెక్టర్ ప్రభాకర్, వార్డు సభ్యుడు నరహరి, బిల్కలెక్టర్ జైపాల్రెడ్డి, స్థానిక నాయకులు రాజేందర్, రవీందర్రెడ్డి, నరేందర్, ఆనంద్ పాల్గొన్నారు.