మంత్రి మంత్రం ఫలించేనా?
Published Wednesday, 27 July 2016హైదరాబాద్, జూలై 26: అయిదు జిల్లాల పరిధులను కలుపుతూ ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ. ఒకవైపు ఆర్థిక సంక్షోభం..మరోవైపు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం కారణాలతో అసలు హెచ్ఎండిఏ శాఖ ఉందా? ఉంటే ఏ రకమైన విధులు నిర్వహిస్తోంది? అన్నది నగరంలో సామాన్యుడికి సమాధానం దొరకని ప్రశ్న. ఇందుకు సమాధానం చెప్పేందుకు, హెచ్ఎండిఏను ముందుకు నడిపించేందుకు నడుం భిగించారు మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్. మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించి తన మంత్రాన్ని ప్రయోగించారు. హెచ్ఎండిఏ పరిధిలో ఏ ప్రాజెక్టు చేపట్టినా, ఇదివరకు మాధిరిగా కాకుండా కాస్త ఉత్సాహాంగా, ప్రతి ప్రాజెక్టు కీలకమేనని భావించాలని సూచించారు. కానీ ఆయన ఆదేశాలు హెచ్ఎండిఏలో అమలయ్యేందుకు జిహెచ్ఎంసి మాధిరిగా సమయం పడుతుందా? జిహెచ్ఎంసి కార్యకలాపాలకు సంబంధించి లోటుపాట్లను గుర్తించే అధికారికంగా, ఆకస్మిక పర్యటనలు నిర్వహించాల్సి వస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోని సుమారు కోటి మంది జనాభా జీవనంతో, రోజువారి కార్యక్రమాలతో ముడిపడి ఉన్న ముఖ్యమైన జిహెచ్ఎంసి, జలమండలి, హెచ్ఎండిఏ వంటి విభాగాల పనితీరును మెరుగుపరిచేందుకు కొద్దిరోజులుగా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! కొద్దిరోజుల క్రితం నగరంలో అధికారికంగా, ఆకస్మికంగానూ పర్యటించిన మంత్రి కెటిఆర్ నగరంలో రోడ్ల దుస్థితి, బస్టాపుల్లో వర్షపు నీటి వంటి పరిస్థితులను గమనించి కొంత అసహనాన్ని వ్యక్తం చేసినా, అప్పటికపుడు బల్దియా అధికారుల్లో మార్పు రాలేదు. ఆ తర్వాత జిహెచ్ఎంసిలో సమీక్ష ఏర్పాటు చేసి చురకలు పెడితే గానీ రోడ్ల మరమ్మతు పనులు క్షేత్ర స్థాయిలో ఊపందుకోలేదు. అలాగే హెచ్ఎండిఏలో కూడా అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు, ప్రజలకు అందిస్తున్న సేవలను త్వరితగతిన అందించేందుకు మంత్రి కెటిఆర్ మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లాంటివి ఇంకెన్ని నిర్వహిస్తే హెచ్ఎండిఏలో అధికారుల పనితీరు మెరుగుపడుతుంది? లేక జిహెచ్ఎంసికి భిన్నంగా ఒకే ఒక్క సమీక్షకు సీను మారుతుందా? వేచి చూడాలి!