భారీ వర్షం
Published Wednesday, 27 July 2016హైదరాబాద్, జూలై 26: మహానగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం పడిన తర్వాత వాతావరణం చల్లబడినట్టే పడి. ఆ తర్వాత భానుడి ప్రతాపంతో మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది. నగరంలోని లక్డీకాపూల్, అమీర్పేట, పంజాగుట్ట, బషీర్బాగ్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, సికిందరాబాద్, పార్శిగుట్ట, ప్యాట్నీ, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాలతో పాటు శివార్లలో కూడా భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాహనాల రాకపోకలతో నిత్యం రద్ధీగా ఉండే లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్పేట, రాణిగంజ్, పంజాగుట్ట సర్కిళ్లలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిల్చిపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో నాంపల్లి, బషీర్బాగ్, ఎం.జె.మార్కెట్, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో కూడా వాహనాలు క్యూ కట్టారు. వర్షం ఆగిన తర్వాత ఒక్కసారిగా వాహనాలు రోడ్డుపైకి రావటంతో నగరంలోని ఖైరతాబాద్, సికిందరాబాద్, బేగంపేట ఫ్లై ఓవర్లతో పాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్పై కూడా వాహనాలు భారీగా క్యూ కట్టాయి. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ముందు, లక్డీకాపూల్ చౌరస్తా, సోమాజిగూడలో మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిల్చిపోవటంతో ద్విచక్ర వాహనాలు మోరాయించాయి. అధికారులు ముందుచూపుతో పలు ప్రాంతాల్లో వర్షపు నీటిని తోడేసేందుకు 119 బృందాలను రంగంలో దింపారు. పలు చోట్ల నీటిని తోడేసే పనులు చేపట్టారు. పివిఎన్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 102 పిల్లర్తో పాటు సుమారు 43 ప్రత్యేక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.