ఫిలింనగర్ సొసైటీ అక్రమాలపై విచారణ జరిపించాలి
Published Wednesday, 27 July 2016ఖైరతాబాద్, జూలై 26: ఫిలింనగర్ సొసైటీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సొసైటీ మాజీ సభ్యుడు రవి ప్రకాష్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సామాజికవేత్త ఎల్లారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. చెన్నైలో స్థిరపడ్డ సినీపరిశ్రమను హైదరాబాద్కు రప్పించేందుకు అప్పటి ప్రభుత్వం ఎంతో ఉదారంగా 98 ఎకరాలను ఫిలినగర్ సొసైటీకి అప్పగించిందని చెప్పారు. కేవలం చిత్రపరిశ్రమకు చెందిన వారికే సదరు స్థలాలను ఇవ్వాల్సి ఉండగా పాలకమండలి సభ్యులు ఇష్టానుసారంగా విక్రయించుకున్నారని ఆరోపించారు. ఫిలింనగర్ సొసైటీలో ప్రస్తుతం 15 శాతం మాత్రమే చిత్రపరిశ్రమకు చెందిన వారు ఉండగా 85 శాతం మంది పరిశ్రమకు సంబంధం లేని వారు ఉన్నారని చెప్పారు. 98 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సొసైటీ స్థలంలో మూడెకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారని చెప్పారు.
సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా పార్కుకు కేటాయించిన స్థలంలో క్లబ్ను నిర్మించి వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న భవనం కింద అమాయకులైన కూలీలు మృతిచెందడం ఎంతో ఆవేదన కలిగించే అంశమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఫిలింనగర్ సొసైటీ అక్రమాలపై విచారణ జరపాలంటూ పలుమార్లు కోరగా నాలుగు కమిషన్లు వేశారని, సదరు కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. కేసిఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలో సిఎంను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు.