డాక్టర్ను కొట్టి చంపేశారు!
Published Wednesday, 27 July 2016నంద్యాల టౌన్, జూలై 26: ద్విచక్ర వాహనానికి కారు తగిలించాడన్న కోపంతో ఓ డాక్టర్ను నలుగురు యువకులు రాళ్లతో కొట్టి చంపిన అమానుష కాండ వెలుగుచూసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి (40) గాజులపల్లె పిహెచ్సిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన అల్లుడు శరత్చంద్రారెడ్డిని నంద్యాల బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారును వెనక్కు తీస్తుండగా అక్కడ ఉన్న మోటార్బైక్కు తగిలింది. దీంతో అక్కడే ఉన్న వలి, ముజీబ్, సల్మాన్, ఇమ్రాన్0మద్యం మత్తులో కోపంతో డాక్టర్తో గొడవపడ్డారు. అప్పటికి వారికి సర్దిచెప్పి డాక్టర్ ఇంటికి వెడుతుండగా బైక్పై వెంబడించిన ఆ నలుగురు మార్గమధ్యంలో కారును అడ్డుకున్నారు. శైలేంద్రను కారు నుంచి బయటకు లాగి రాయితో కొట్టి పరారయ్యారు. కణతపై రాయి తగలడంతో కుప్పకూలిపోయిన శైలేంద్రను చుట్టుపక్కలవారు చూసి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.