బందరు పోర్టు పేరుతో భూ సమీకరణ ఆపాలి
Published Wednesday, 27 July 2016విజయవాడ, జూలై 26: బందరు పోర్టు, మడా పేరుతో సుమారు 36వేల ఎకరాల భూ సమీకరణకు జారీచేసిన జీవో 185ను తక్షణమే ఉపసంహరించాలని, 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్, వంగల సుబ్బారావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బందరు పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతాయని పోర్టు అధికారులు నిర్ధారించారు. దేశంలో ఉన్న అతి పెద్ద పోర్టులన్నీ 2వేల ఎకరాల్లోపే నిర్మించబడ్డాయి. మడా పేరుతో 36వేల ఎకరాల భూ సమీకరణకు పూనుకోవడం రైతుల భూములను కొల్లగొట్టి కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టడానికేనన్నారు. ఈ నిర్ణయాన్ని బందరు పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.