సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య
Published Wednesday, 27 July 2016తిరువూరు,జూలై 26: ప్రముఖ సీనియర్ న్యాయవాది కొత్త వెంకటేశ్వరరావు(58) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జంట థియేటర్ల సెంటర్లోని తన నివాసంలోని వంటగదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండగా కనుగొన్నారు. గతంలో ఈయన ఎజిపిగా, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవీతో పాటు బార్లో పలు కీలక పదవులు అలంకరించారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. సౌమ్యుడు, వృత్తి పట్ల అంకితభావం గల వెంకటేశ్వరరావు ఆత్మహత్య ఈప్రాంతంలో తీవ్ర సంచనలం కలిగించింది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ దామోదరరావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పఠాన్షీయాజ్ఖాన్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఎఎంసి చైర్మన్ తాళ్ళూరి రామారావు పలువురు న్యాయవాదులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపం ప్రకటించారు. సిఐ ఎం కిషోర్బాబు, ఎస్ఐలు సురేష్, కన్నప్పరాజు, ఎఎస్ఐ మోహనరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.