అమర జవాన్ల త్యాగం మరువలేనిది
Published Wednesday, 27 July 2016తాడేపల్లిగూడెం, జులై 26: దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాన్ని భారతజాతి ఎప్పుడూ గుర్తించుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా రూరల్ మండలం మిలటరీ మాధవరంలో అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి దేశ రక్షణ కోసం తమ బిడ్డలను, కుటుంబీకులను సైన్యంలోకి పంపుతున్న మిలటరీ మాధవరం పుణ్యభూమి అని, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. శతాబ్దాలుగా భారతజాతి రక్షణ కోసం త్యాగాలు చేస్తున్న మాధవరం గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాధవరం సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. భారత సైన్యంలో చేరే యువతకు శిక్షణా కేంద్రాన్ని మాధవరంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆదర్శ గ్రామంలో మాధవరాన్ని రూపొందిస్తామన్నారు.
కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన 527 మంది సైనికులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో సేవలందించిన మాధవరం సైనికులు తోట ప్రసాద్, తలగాని ప్రభాకరరావును అభినందించారు. ఈ సమావేశానికి మాజీ సైనిక సంఘం నాయకులు బొల్లం వీరయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, టీబీ ఆర్ సంస్థల ఛైర్మన్ టి భోగేశ్వరరావు, సర్పంచ్ పరిమళ, బిజెపి మండలాధ్యక్షులు అంగిన సత్తిబాబు, పట్టణాధ్యక్షులు కర్రి ప్రభాకర బాలాజీ, కొండపల్లి నగేష్, ఎంపిటిసి మాదాసు వరలక్ష్మి, పసల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.