ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు తక్షణమే చేపట్టాలి
Published Wednesday, 27 July 2016కె.కోటపాడు, జూలై 26: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దశలవారీగా చేపట్టి రాబోయే మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక శివాలయంలో కె.కోటపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో బహిరంగ సభను నిర్వహించారు. సమితి సభ్యులు పి.వి.జి. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల సంపూర్ణ అభివృద్ధికి ఈప్రాంత రైతాంగానికి శాశ్వత లబ్ధి చేకూర్చే ఈ పథకం పూర్తి చేస్తే కె.కోటపాడు మండలంలో 19,620 ఎకరాలు, దేవరాపల్లి మండలంలో 17 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఏడాదికి రెండు, మూడు పంటలు పండించి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినా ప్రభుత్వం 63 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఈ పథకాన్ని పూర్తి చేసి అండగా నిలవాలన్నారు. ఇప్పటికే పురుషోత్తపట్నం వద్ద రూ.వెయ్యి కోట్ల నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడాన్ని ఆయన స్వాగతించారు.
విశాఖ జిల్లాలోని 18 మండలాల్లోని 3.14 లక్షల ఎకరాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తయితే సాగులోకి వస్తుందన్నారు. అంతకుముందు ప్రజానాట్యమండలి కళాకారులు గొర్లి దేముడుబాబు, పొంతపల్లి రామారావులు పాడిన పాట అందరినీ అలరించింది. సుజల స్రవంతి పోరాటం చేస్తున్న మాజీ మంత్రి కొణతాలకు మనమంతా సంపూర్ణ మద్దతును ప్రకటించాలని చీడికాడ జెడ్.పి.టి.సి. సభ్యురాలు పి. సత్యవతి కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండలానికి చెందిన జయప్రకాష్బాబు, కె.కోటపాడు మండలానికి చెందిన దాట్ల తాతరాజు, రొంగలి పాలవెల్లి, బొడ్డు వెంకటరావు, సి.పి.ఐ. నాయకులు పాల్గొన్నారు.