వనమహోత్సవానికి సమాయత్తం కావాలి
Published Wednesday, 27 July 2016సారవకోట, జూలై 26: ఈనెల 29న నిర్వహించనున్న వనమహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్వం కావాలని స్థానిక మండల ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న, జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వన మహోత్సవం రోజున మండలంలోని వివిధ ప్రాంతాలలో 50వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపిడివో లవరాజు మాట్లాడుతూ రహదారుల పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని కిలోమీటర్కు ఒకరుచొప్పున ఉపాధి హామీ పథకం కింద వేతనదారునిగా నియమిస్తామని వివరించారు. గ్రామాలలో స్మశాన వాటికల చుట్టు మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ ఏపివో శశిభూషణరావు సూచించారు. మండలంలోని పెద్దలంబ, సరవబొంతు నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉన్నాయని అటవీశాఖాధికారులు స్పష్టంచేశారు. మండల పరిషత్ ఇంజినీర్ సింహాచలం మాట్లాడుతూ చెర్రీస్ మొక్కలను ఇండ్ల పెరటలలో, రహదారులకు ఇరువైపులా నాటితే గొడుగుల ఎండ వేడిమి నుండి రక్షణ ఇస్తుందని వివరించారు. ఇటీవల నీరు-చెట్టు కార్యక్రమంలో పనులు చేపట్టిన చెరువుగట్లపై మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నామని నీటి పారుదల శాఖ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.