గ్రంథాలయ సెస్సుగా రూ. కోటి: చైర్మన్ విఠల్
Published Wednesday, 27 July 2016శ్రీకాకుళం(కల్చరల్), జూలై 26: జిల్లాలో గ్రంథాలయ సెస్సుగా కోటి రూపాయలను వసూలు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్రావు తెలిపారు. మంగళవారం ఆయన అధ్యక్షతన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ 2016 ఏప్రిల్ 1నాటికి రూ.40లక్షల సెస్సునువసూలు చేశామన్నారు. గత ఏడాది రూ.60లక్షల సెస్సుగా వసూలు చేశామని కోటబొమ్మాళి, కొత్తూరు, గార మండలాల గ్రంథాయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు రూ.20లక్షలతో ప్రతిపాదించామన్నారు. పాతపట్నం గ్రంథాలయానికి అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాజాం గ్రంథాలయం 50 ఏళ్ళు దిగ్విజయంగా స్వర్ణోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రంథాలయ నిర్వహణలో గ్రంథపాలకులు క్రమశిక్షణతో నిర్వహించాలని సమయపాలన పాటించాలని ఆదేశించారు. అలాగే ఈ సంవత్సరం స్టేషనరీ రూ.2.50 లక్షలు, కంప్యూటర్ కొనుగోలుకు రూ.2లక్షలు, ప్రింటింగ్, బైండింగ్కు రూ.1లక్ష, ఫర్నిఛర్ కొనుగోలుకు రూ.5లక్షలు, గ్రంథాలయ పుస్తకాల కొనుగోలుకు రూ.5లక్షలు ప్రతిపాధించినట్టు సర్వసభ్య సమావేశం ఆమోదించినట్టు తెలిపారు.
ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార రాజా, సంస్థ బోర్డు డైరెక్టర్ తెలుగు నాగేశ్వరరావు, డిపిఆర్వో ఎల్.రమేష్, పంచాయతీ అధికారి నారాయణరావు, వయోజన విద్యా సహాయ ప్రాజెక్ట్ అధికారి కె.డొంబు, ఏ.వి ప్రసాద్ పాల్గొన్నారు.