‘ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయాలి’
Published Wednesday, 27 July 2016ఒంగోలు అర్బన్, జూలై 26 : పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసేందుకు కృషి చేయాలని సిపిఎం రాష్టక్రమిటీ సభ్యుడు ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం నాటికి మూడవరోజుకు చేరుకున్నాయి. ఈ తరగతుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ-పరిణామాలపై ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య పెట్టుబడితో అమలుచేస్తున్న నూతన ఆర్థికవిధానాలు, ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న దేశాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. ఈ విధానాలకు వ్యితిరేకంగా ఆయా దేశాల ప్రజలు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఈ ఆర్థిక విధానాల వల్ల ప్రజలకు నష్టం తప్ప ఒరిగేది ఉండదని నిర్ధారిస్తున్నారని వివరించారు. మన దేశంలో గత 25 సంవత్సరాలుగా ఈ విధానాలను పాలకులు అమలు చేసిన ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయన్నారు. దేశసంపద అంతా 85మంది బడా పెట్టుబడుదారుల వద్ద పోగైందని పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాలు పడుతున్నాయని, పేదరికం మరింత పెరిగిందని అన్నారు. గత యుపిఎ ప్రభుత్వం ఈ విధానాలను అమలుచేసిన ఫలితంగానే 2014లో ప్రజలు కాంగ్రెస్ను తరిమికొట్టారని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోదీ, చంద్రబాబు కూడా నూతన ఆర్థిక, ప్రపంచీకరణ విధానాలనే అమలు చేస్తున్నారని విమర్శించారు. వారు ఈ విధానాలను గత ప్రభుత్వాల కంటే వేగంగా అమలు జరుపుతున్నారని చెప్పారు. ఫలితంగా రోజురోజుకు నిత్యావసర వస్తువులు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవన్నారు. ఈ విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై అసంతృప్తితోనే దేశంలో రిజర్వేషన్ ఉద్యమాలు, కుల ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ ఉద్యమాలను పాలకులే ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజలను ఐక్యంకాకుండా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ తరగతులకు రాష్టక్రమిటీ సభ్యులు జాలా అంజయ్య ప్రిన్సిపాల్గా వ్యవహరించగా, కేంద్ర, రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.