జిల్లాలో పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికల కోలాహలం
Published Wednesday, 27 July 2016ఒంగోలు, జూలై 26 : జిల్లావ్యాప్తంగా పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఓటర్ల జాబితాలను మంగళవారం ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. ఈ నెల 29న 3 గంటలకు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల్లోగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు నూతన కార్యవర్గం చేత మొదటి సమావేశాన్ని నిర్వహించనున్నారు. కమిటీలో ఎక్స్అఫిషియో మెంబర్లుగా, కన్వీనర్గా పాఠశాల హెడ్మాస్టర్, ఎఎన్ఎం, వార్డుమెంబర్, మహిళా సమాఖ్య మెంబర్లు ఉండనున్నారు. ఈ కమిటీలో తొమ్మిది నుంచి 24 మంది వరకు మెంబర్లుగా ఉంటారు.
జిల్లా వ్యాప్తంగా 3400 పాఠశాలలు ఉండగా వాటిలో 2560 ప్రాథమిక పాఠశాలలు, 361 ప్రాథమికోన్నత పాఠశాలలు, 435 ఉన్నత పాఠశాలతోపాటు మరికొన్ని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మంగళవారం నుంచి ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పాఠశాల యజమాన్య కమిటీ చైర్మన్గా పోటీ చేసేందుకు ఈపాటికే తెలుగుదేశం, వైకాపాలకు చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. జిల్లాలో తొలుత జరిగే ఎన్నికలు కావడంతో ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్గా తీసుకోనున్నారు. పాఠశాల యజమాన్య కమిటీలకు గతంలోనే తీవ్రమైన పోటీ నెలకొనగా, ఈ సారి ఆ పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలోను పాఠశాల యజమాన్య కమిటీల ఎన్నికలదే చర్చగా మారింది. కొన్ని పాఠశాలల కమిటీలు ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు ఉండగా మరికొన్ని పాఠశాలలకు మాత్రం తీవ్రమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైస్కూళ్లకు జరిగే ఎన్నికలు మాత్రం పంచాయతీ ఎన్నికలను తలపించేవిధంగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో ఈ పాటికే విద్యార్థుల తల్లిదండ్రులు పోటీలోకి దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని పాఠశాలలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా నేటి నుంచి పాఠశాల యజమాన్య కమిటీల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.