పాఠశాలల్లో ప్రారంభమైన ఎన్నికల సందడి
Published Wednesday, 27 July 2016వేదాయపాళెం, జూలై 26: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి యాజమాన్య కమిటీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారుల ఉత్తర్వుల మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో హడావుడి నెలకొంది. ఈ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం ఓటర్ల జాబితాలను ఆయా పాఠశాలల నోటీస్ బోర్డులపై అతికించారు. ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను నోటీసు బోర్డులో ఉంచారు. 29వ తేదీన ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సవరించి అదేరోజు చివరి జాబితాను ప్రకటించనున్నారు. ఆగస్టు 1వ తేదీన యాజమాన్య కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదేరోజున చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికతోపాటు తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో నోటీసు బోర్డులపై ఓటర్ల జాబితాను ఉంచకపోవడం గమనార్హమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.