ప్రత్యేక హోదాపై టిడిపికి చిత్తశుద్ది లేదు
Published Wednesday, 27 July 2016కోట, జూలై 26: ప్రత్యేక హోదా విషయమై టిడిపి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడంలేదని డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య ధ్వజమెత్తారు. మంగళవారం కోటలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుముఖత చూపడంలేదన్నారు. రాష్ట్ర విభజన సమంయలో పొందుపర్చిన అంశాలను బిజెపి ప్రభుత్వం అమలు చేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడంలేదని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, గూడూరు - దుగ్గరాజపట్నం రైల్వే మార్గం ఏర్పాటు చేయాల్సివుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంశాలను పక్కన పెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా విషయమై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరైన న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డిసిసి ఉపాధ్యక్షులు వై మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీజూరు మల్లికార్జున్రావు, తాజూద్ధీన్, అల్లం బాబు పాల్గొన్నారు.