ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
Published Wednesday, 27 July 2016గుంటూరు, జూలై 26: నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆకాశమే హద్దుగా పెరుగుతూ సామాన్యులు ధరాఘాతానికి గురవుతున్నారని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం 26వ డివిజన్ కృష్ణబాబు కాలనీలోని హెల్త్సెంటర్ నుండి గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందంగా ఉందని విమర్శించారు. పాలకులే దళారులతో కుమ్మక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తూ పండించిన రైతులను, మరోవైపు వ్యాపారులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. కనీసం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్న ధ్యాసకూడా ప్రభుత్వానికి లేకపోవడం దురృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, గేదెల రమేష్, గంపా వెంకటేశ్వరరావు, వెంకట్రావ్, కృష్ణ, జగన్కోటి, పద్మావతి, అంజిరెడ్డి, సుంకర రామాంజి, యోగేశ్వరరెడ్డి, యద్దనపల్లి బాలరాజు, జాన్సీ, ఎస్కె జాని, పల్లపు మహేష్ పాల్గొన్నారు.