దోపిడీ ముఠా అరెస్టు
Published Wednesday, 27 July 2016మండపేట, జూలై 26: వ్యసనాలకు బానిసలై మహిళను ఎరగావేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను మండపేట పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి లక్షా 33 వేల రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులుగా పేర్కొన్నవారిని మంగళవారం ఆలమూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు మండపేట పట్టణ సిఐ కె హ్యాపీ కృపావందనం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చింతపర్తి రాజు, వాసంశెట్టి సోనీ ప్రసాద్, తోట మేరీ స్వప్న, చింతపర్తి చిట్టిబాబు స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి, డబ్బు సంపాదనకు అడ్డదార్లు తొక్కారు. స్వప్నను ఎరగా చూపి, ప్రయాణీకులను బెదిరించి, దోచుకునేవారు. బైపాస్ రోడ్డులో లారీ డ్రైవర్లను ఆకర్షించి, వారిని స్వప్న మాటల్లో దింపే సమయంలో మిగిలిన ముగ్గురు దాడి చేసి, వారి నుండి సొమ్ములు గుంజుకునేవారు. ఈ నెల 13న బైపాస్ రోడ్డు లో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన లారీని ఆపి, డ్రైవర్ నరసింహమూర్తిని స్వప్న కవ్వించి బురిడీ కొట్టించింది. ఈలోగా మాటు వేసిన రాజు, సోనీ ప్రసాద్, చిట్టిబాబు డ్రైవర్పై దౌర్జన్యానికి దిగి, అతని వద్ద ఉన్న 24 వేల రూపాయల నగదును దోచుకున్నారు. స్పృహతప్పిన డ్రైవర్ను క్లీనర్ రాము పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, ఫిర్యాదు చేశాడు. అదే విధంగా ఈ నెల 15 రాత్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాజీ మాస్టారు సంఘపుంత రోడ్డులోని తన ఇంటికి వెళ్ళి, మోటార్ సైకిల్ను నిలిపిన సమయంలో స్వప్న అతడిని మాటల్లోకి దింపింది. అదే అదనుగా మిగిలిన వారు మోటార్ సైకిల్ సీటు కింద ఉన్న నాలుగున్నర కాసుల బంగారు రుద్రాక్ష హారాన్ని మాయం చేశారు. ఈ నెల 10న బస్టాండ్ వద్ద గల సైకిల్ స్టాండ్లో నిలిపి ఉన్న పల్సర్ మోటార్ సైకిల్ను దొంగిలించారు. ఈ నెల 14న సంఘం కాలనీలో మాచిరాజు సోమరాజు ఇంటి ముందు పార్కు చేసిన హీరోహోండా మోటార్ సైకిల్ను దొంగిలించారు. జరిగిన దొంగతనాల తీరు ఒకే విధానంలో ఉండటం, మహిళతో పాటు ముగ్గురు యువకులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలో సిఐ కృపావందనం బైపాస్ కొత్త వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా కనిపించింది. అనుమానించిన పోలీసులు వెంటపడి, విచారణ చేపట్టగా నేరాలన్నీ తామే చేశామని ఒప్పుకున్నారు. స్వప్న వద్ద నుండి 7 వేల 5 వందల రూపాయల నగదు, చిట్టిబాబు ఇంటి వద్ద దాచిన రెండు బైక్లు, బంగారు రుద్రాక్ష మాల, రాజు వద్ద 10 వేల రూపాయలు, సోనీ ప్రసాద్ నుండి 4 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నేరాలకు వినియోగించిన మరో బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును విజయవంతంగా ఛేదించడంలో పట్టణ ఎస్సై వి సురేష్, పిసి యేసుకుమార్ల కృషిని సిఐ హ్యాపీ కృపావందనం ప్రశంసించారు.