యజమాని ఆగ్రహానికి కార్మికుడి బలి
Published Wednesday, 27 July 2016తిరుపతి, జూలై 26: హలాల్ చేయడానికి తీసుకెళ్తున్న ఓ పొట్టేలు పారిపోయిందని యజమాని కొట్టిన రెండు దెబ్బలకు ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన మంగళవారం తిరుపతిలో సుభాష్ నగర్లో జరిగింది. వివరాల్లోకెళితే.. లీలామహల్ సెంటర్లో షేక్ మహ్మద్ అలీ మాంసపు దుకాణం నడుపుతున్నాడు. ఆయన వద్ద షేక్ గులాబ్ (32) పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పొట్టేలును హలాల్ చేసుకొని తీసుకురమ్మని యజమాని మహ్మద్ అలీ షేక్ గులాబ్ను ఆదేశించాడు. ఈ నేపథ్యంలో గులాబ్ పొట్టేలును పట్టుకొని వెళ్తుండగా అది విదిలించుకొని పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని మహ్మద్ అలీ నీ నిర్లక్ష్యంతోనే పొట్టేలు పారిపోయిందంటూ చెంపపై రెండు దెబ్బలు కొట్టాడు. దీంతో షేక్ గులాబ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. దీంతో కుటుంబాన్ని పోషిస్తున్న ఒక్కదానొక్క కొడుకు మరణించడంతో గులాబ్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. యజమాని కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే తన కుమారుడు మరణించాడని తిరుపతి ఈస్ట్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. సి ఐ రామ్కుమార్ సంఘటనాస్థలానికి చేరుకొని సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాంసం దుకాణం యజమాని షేక్ మహ్మద్ అలీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. గులాబ్ మరణానికి పొట్టేలు ఒక యమ పాశమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.