30న కాపుల భారీ ర్యాలీ
Published Wednesday, 27 July 2016విజయవాడ, జూలై 26: కాపులను బిసిలుగా గుర్తించేందుకు నియమించబడిన జస్టిస్ మంజునాధ్ కమిషన్ ఆగస్టు మాసాంతంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో ఇప్పటికే అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ఊపందుకోటం ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో గుంటూరుకు చెందిన సీనియర్ నేత లింగంశెట్టి ఈశ్వరరావును కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం చైర్మన్గా పార్టీ నియమించింది. ఈ నెలాఖరులోనే ఈయన నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. గత ఎన్నికల సమయంలో బిసి రిజర్వేషన్ బూచి చూపి కాపుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హామీని అమలు చేయటంలో కాలయాపన చేస్తుందన్న భావనను కాపు వర్గంలోకి బలీయంగా తీసుకెళ్లేందుకు పిసిసి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ ఏపి నలుమూలల నుంచి వచ్చే సీనియర్ నాయకులు, వందలాది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి మంజునాధ్ కమిషన్కు వినతిపత్రం ఇచ్చేందుకు భారీ సన్నాహాలు కావిస్తున్నది. మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడారు. తాము కొత్త డిమాండ్ను ప్రభుత్వం ముందు వుంచటం లేదని గతంలో అమల్లో వున్న బిసి రిజర్వేషన్ను పునరుద్ధరించాలనే కోరుతున్నామని ఆయన చెప్పారు.
విలేఖరులతో మాట్లాడుతున్న లింగంశెట్టి