తెలుగు రాష్ర్టాలకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదు
Published Wednesday, 27 July 2016దిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం బుధవారం రాజ్యసభలో స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలకు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. వాస్తవానికి నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ రెండు రాష్ర్టాల్లోనూ ముందుగానే స్థానాలు పెంచాలని కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలలోనూ నియోజకవర్గాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని, ఇందుకు రాజ్యాంగం ఒప్పుకోదని అటర్నీజనరల్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలని అనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని టీడీపీ ఎంపీ దేవేందర్గౌడ్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి గంగారామ్ బదులు ఇచ్చారు.