31లోపు బూత్ కమిటీలను నియమించాలి
Published Thursday, 28 July 2016హైదరాబాద్ జూలై 27: మహానగరంలో భారతీయ జనతాపార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు ఈ నెల 31వ తేదీలోపు బూత్ స్థాయి కమిటీల నియామకాలను పూర్తి చేసుకోవాలని బిజెపి శాసనసభ పక్ష నేత జి. కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడు బి.వెంకట్రెడ్డి అధ్యక్షతన బుధవారం బర్కత్పురాలోని సిటీ ఆఫీసులో నగర పార్టీ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోపు నగరంలోని అన్ని సెగ్మెంట్లలో బూత్ కమిటీ నియామకాలను పూర్తి చేసుకుని, వన్ బూత్ టెన్ యూత్ అన్న నినాదంతో ఆగస్టు 7న నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రదాని నరేంద్రమోదీ సభకు ఒక్కో బూత్ కమిటీని కనీసం పది మంది సభ్యులు హజరుకావాలని ఆయన సూచించారు. ఇది కేవలం పార్టీ సమావేశమని, మోదీ ప్రసంగం కార్యకర్తలనుద్దేశించి ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి కార్యకర్త పార్టీకి నిబద్దతతో పనిచేసే 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలన్నదే కేంద్ర పార్టీ నిర్ణయమని కిషన్రెడ్డి వెల్లడించారు. అన్ని డివిజన్ల నుంచి డివిజన్ అధ్యక్షులు, బూత్లలోని కార్యకర్తలు వచ్చేలా చూడాలని తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్, వెంకటరమణి, శ్యాంసుందర్గౌడ్, గౌతమ్, రాజశేఖర్రెడ్డి, భవర్లాల్ వర్మ, ఉమా మహేంద్ర, రామన్గౌడ్, సహదేవ్యాదవ్, మాచెర్ల శ్రీనివాస్, మహేందర్ వ్యాస్, మనోహర్ ఠాక్రే, సికె. శంకర్, నరసింహ, బండారి రాధిక, కమల్ కంది, కవిత, సాధన ఠాకూర్ పాల్గొన్నారు.