కనిపించిన శకలాలు
Published Thursday, 28 July 2016చెన్నై, జూలై 27: చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్బేస్నుంచి పోర్టు బ్లెయిర్కు వెళ్తూ ఆరు రోజుల క్రితం బంగాళాఖాతంపై కనిపించకుండా పోయిన వాయుసేన విమానం ఎఎన్-32 కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగింది. కాగా, సముద్రంలో కొన్ని శకలాలు కనిపించాయని, అయితే అవి ఎఎన్-32 విమానానికి చెందినవో, కాదో నిర్ధారించాల్సి ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రామేశ్వరంలో విలేఖరులతో చెప్పారు. ఎలాంటి కచ్చితమైన వార్తలు లేవని, అయితే కొన్ని శకలాలు మాత్రం కనిపించాయని పారికర్ చెప్పారు. ఈ శకలాలు కనిపించకుండా పోయిన ఎఎన్-32 విమానానికి చెందినవో కాదో నిర్ధారించాల్సిందిగా గాలింపు చర్యల్లో పాలు పంచుకొంటున్న నౌకలను కోరినట్లు ఆయన చెప్పారు. వాయుసేనకు చెందిన ఎఎన్-32 విమానం జాడ తెలుసుకోవడానికి నౌకాదళం, కోస్టుగార్డు, వాయుసేనకు చెందిన 17 నౌకలు, 23 విమానాలు చెన్నైనుంచి పోర్టుబ్లెయిర్కు మధ్య బంగాళాఖాతం అంతటా అనే్వషణ జరుపుతున్నాయి. ప్రాణాలతో ఉన్న వారు లేదా శకలాలు ఏమయినా కనిపిస్తాయేమో చూడాల్సిందిగా గాలింపు జరుపుతున్న జోన్గుండా వెళ్లే వాణిజ్య నౌకలను కోరాలంటూ అంతర్జాతీయ సేఫ్టీ నెట్వర్క్ను సైతం అప్రమత్తం చేయడం జరిగింది.