మా జోలికొస్తే ఊరుకోం
Published Thursday, 28 July 2016న్యూఢిల్లీ, జూలై 27: జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీలేదని వీటి పరిరక్షణకు అన్ని చర్యలూ చేపడతామని భారత్ బుధవారం పాకిస్తాన్కు విస్పష్టంగా తెలియజేసింది. కాశ్మీర్లో రోజుల తరబడి అంశాంతిమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ చర్యలకు చాలా ఘాటుగానే భారత్ ప్రతిస్పందించింది. పాక్ ఆక్రమణలో ఉన్న భూ భాగం నుంచి తలెత్తుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పఠాన్కోట్సహా ఇతర ఉగ్రవాద చర్యలు, చొరబాట్లు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని పార్లమెంటుకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్ నివేదించారు. ఇటీవల కాశ్మీర్లో మరణించిన ఓ ఉగ్రవాదికి సంబంధించి పాకిస్తాన్ చేసిన ప్రకటనను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక కార్యకలాపాలను తక్షణమే కట్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఉగ్రవాద కార్యకలాపాలు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న వాస్తవాన్ని పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ముంబయిపైనా అలాగే పఠాన్కోట్పైనా జరిగిన దాడులకు కుట్రపన్నిన ఉగ్రవాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని పాక్ను డిమాండ్ చేశారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణకు అహరహం కృషి చేస్తున్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ నిరంతర అప్రమత్తత కొనసాగిస్తున్నామని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో భారత్కు చెందిన 70వేల చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా, దౌర్జన్యంగా ఆక్రమించుకుందని అలాగే ఈ రాష్ట్రంలోని మరో 30వేల చదరపుకిలోమీటర్ల భూ భాగాన్ని చైనాకూడా అక్రమించుకుందని వికె సింగ్ ఈ సందర్భంగా లోక్సభకు తెలిపారు. అలాగే 1963లో కుదిరిన చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం కింద ఆక్రమిత కాశ్మీర్లోని 5,180 కిలోమీటర్ల భారత్ భూ భాగాన్ని చైనాకు పాక్ అప్పగించిందని మంత్రి పేర్కొన్నారు. ఆక్రమిత కాశ్మీర్లో చైనా నిర్మిస్తున్న అనేక వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా తాము గమనిస్తున్నామన్నారు. భారత్ ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.