ప్రజల ఆరోగ్యంలో ఆశాకార్యకర్తల పాత్ర కీలకం
Published Thursday, 28 July 2016ఉట్నూరు, జూలై 28: గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆశాకార్యకర్తల పాత్ర కీలకమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్వి కర్ణన్ అన్నారు. గురువారం స్థానికంగా ఆశాకార్యకర్తల సమ్మేళనం మొదటిసారి నిర్వహించా పెద్దఎత్తున ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైద్యాధికారికంటే ముందుగా వ్యాధులను అరికట్టడంలో ఆశాకార్యకర్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ఆశాకార్యకర్తల కృషివల్లనే గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారని, మలేరియా, డయేరియా, కలార, మాతాశిశు మరణాల నిరోదానికి ఎంతో కృషి ఉంటుందన్నారు. ఆశాకార్యకర్తలు ఇంటింటికి తిరిగి అక్కడి స్థానిక భాషలో దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వలేకుండా చూసే విధంగా గ్రామ ప్రజలకు అవగాహణ కల్పించి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని అన్నారు. దోమల నివారణకు ఐఆర్ఎస్ స్ప్రేను కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా విటిడిఏ లతో కలిసి ఆశాకార్యకర్తలు కలిసి ఇంటింటా స్ప్రేచేయాలని అన్నారు. దీనికి సంబంధించిన నిధులు వారివారి ఖాతాల్లో జమచేస్తామని అన్నారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభకనబర్చి విధులను నిర్వర్తించిన 18 మంది ఆశాకార్యకర్తలకు ప్రశంసా పత్రాలతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభకర్ రెడ్డి, వైద్యులు పాల్గున్ కుమార్, ఎఎంవో వెంకటేశం, సిబ్బంది రాములమ్మ పాల్గొన్నారు.