ఇండోర్ సిటీలా.. కరీంనగర్ సిటీ...
Published Thursday, 28 July 2016కరీంనగర్, జూలై 28: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోని రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తాము ఇండోర్లో పర్యటించి ఆధ్యయనం చేశామన్నారు. రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని నెంబర్ వన్గా నిలుపుతామని, ఇందుకు నగర ప్రజలు సహకరించాలని కోరారు. సిఎం కెసిఆర్ కరీంనగర్ తొలి పర్యటన సందర్భంగా రహదారుల అభివృద్ధి కోసం రూ.46 కోట్లు విడుదల చేశారని, మళ్లీ రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాల తరలింపు కోసం రూ.28 కోట్లు మంజూరు చేశారని, తిరిగి ఇప్పుడు రహదారుల నిర్మాణాల కోసం సుమారు రూ.37 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఇవేకాక రూ.100 కోట్లు అంతర్గత రహదారుల కోసం ప్రతిపాదనలు పంపామని, రూ.77 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కరీంనగర్ నగరాభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని, ఈ రెండేళ్ల కాలంలో రూ.119 కోట్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని అన్నారు. నగరాన్ని అందంగా తయారు చేసే బాధ్యత మాదేనని, ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. ఇంతపెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సిఎం కెసిఆర్, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపి వినోద్కుమార్లకు నగర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్అండ్బి ఎస్ఇ సతీష్ మాట్లాడుతూ జనవరి వరకు నగర రహదారులన్నింటిని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మేయర్ రవీందర్సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, కార్పొరేటర్లు ఆరీఫ్, శ్రీకాంత్, యాదయ్య, వెంకటరమణ, వేణు, పెద్దపల్లి రవీందర్, ఎంపిపి వాసాల రమేష్తోపాటు నాయకులు చల్లా హరిశంకర్, బొమ్మరాతి సతీష్ పాల్గొన్నారు.