మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలి
Published Thursday, 28 July 2016ఎల్లారెడ్డిపేట, జూలై 28: గత అరవై ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు నిరధారణకు గురయ్యాయి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి చెరువులకు జలకళ తీసుకురావడానికి తమ ప్రభుత్వం మిషన్కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది.. అందుకు 20 వేల కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.. మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కెటిఆర్ సాగీ డైరెక్టర్ డాక్టర్ కుశాల్ పథక్ను కోరారు. కరీంనగర్ ఎంపి వినోద్కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లిలో గురువారం కుశాల్ పథక్ పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కెటిఆర్, ఎంపి బోయనపల్లి వినోద్కుమార్లు క్షేత్ర స్థాయిలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, నిరుపేద యువతి వివాహాలకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, తదితర పథకాల ద్వారా ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. మొక్కలను నాటేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ యేడాది 46 వేల కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో మొత్తం 200 కోట్ల మొక్కలు నాటడడమే లక్ష్యమని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి మార్గం చూపాలని పేర్కొన్నారు. కుశాల్ పథక్ సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు హరితహారంలో భాగంగా మంత్రి కెటిఆర్, సాగీ డైరెక్టర్ కుశాల పథక్, ఎంపి వినోద్కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్లు మొక్కలను నాటారు. గ్రామ సభను నిర్వహించారు. ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.