సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
Published Friday, 29 July 2016విజయనగరం (్ఫర్టు), జూలై 28: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేయడం తప్పదని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం కూడా తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీలో 200 పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు ఇంతవరకు పిఆర్సి అమలు చేయలేదని చెప్పారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫారం, సబ్బులు, కొబ్బరినూనె పంపిణీ తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. అదేవిధంగా కార్మికులకు హెల్త్కారులను పంపిణీ చేయాలని కోరారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పువాటల్లే జీవో- 279ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో అనేక గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయని, ఎన్నో అపార్టమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, పట్టణ విస్తీర్ణం పెరుగుతోందని, కార్మికులపై పనిభారం పెరుగుతోందని, కార్మికుల సంఖ్య పెంచడం లేదన్నారు. తక్షణమే కార్మికుల సంఖ్య పెంచాలని ఆయన కోరారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేయడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.రంగరాజు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పాల్గొన్నారు.