‘చింతలపూడి’ రైతులకు న్యాయంచేస్తా
Published Friday, 29 July 2016ఏలూరు, జూలై 28: చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ విషయంలో రైతులపక్షాన నిలబడి వారికి పూర్తిన్యాయం చేస్తానని రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం తనను కలిసిన రైతులతో మంత్రి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి భూయజమానులకు న్యాయమైన నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈవిషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి న్యాయం చేసిన తర్వాతే కాల్వ పనులు ప్రారంభిస్తామన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో కొంతమంది రైతులపై పెట్టినకేసులను వెంటనే ఉపసంహరించాలని లేనిపక్షంలో వారి తరపున తాను పోరాటం చేస్తానని మంత్రి సుజాత స్పష్టం చేశారు. ఇప్పటికే సేకరించిన భూమికి సరైన నష్టపరిహారం అందించే విషయమై కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపటం జరిగిందన్నారు. రైతులకు ఉన్న అభ్యంతరాలను స్వీకరించి వాటిపై రైతులు, అధికారులతో ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి దాసరి రామక్క, ఎంపిటిసి తాడి లక్ష్మి, స్ధానిక నాయకులు చినబాబు, శేషగిరి, ఆది జగన్న, వీరేంద్ర, సయ్యద్బాబు, ఆశీర్వాదం, భూషణం, రామారావు తదితరులు పాల్గొన్నారు.