ఘనంగా ఆడికృత్తిక మహోత్సవం
Published Friday, 29 July 2016కడప(కల్చరల్), జూలై 28:స్వస్తిశ్రీ దుర్మిఖినామ సంవత్సర ఆశాఢ బహుళ నవమి పురస్కరించుకుని గురువారం నగరంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీవల్లీదేవసేన సమేత స్వామివారికి ఆడికృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు వారి సమీపంలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఉదయం 8గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనము, స్వామివారి అభిషేకం, వేదవచనం ఘనంగా నిర్వహించారు. అలాగే మద్యాహ్నం 12 గంటలకు అర్చన, మహానైవేద్యం, మంత్రపుష్పం, మంగళహారతి ఇచ్చారు. దేవునికడపలోని శ్రీసోమేశ్వరస్వామి దేవస్థానంలో వెలిసివున్న శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం 6గంటల నుంచి మయూరి వాహనంలో స్వామివార్ల ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రామచంద్రయ్య కాలనీలోని శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ మైదానంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలోని శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో, కలెక్టర్ బంగ్లా సమీపంలోని శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.