మార్క్సిజం నాకు విశ్వదర్శనం చేయించింది
Published Friday, 29 July 2016గుంటూరు (కల్చరల్), జూలై 28: సామాజిక బాధ్యతతో కవిత్వం రాసే తనకు మార్క్సిజం విశ్వదర్శనం చేయించిందని, వాస్తవంగా చెప్పాలంటే ఆ యిజమే నాకు దిక్సూచిగా నిలబడిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కె శివారెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఉదయం అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ఆయన సాహిత్యంలో తన ప్రారంభం మొదలుకుని ఇప్పటివరకు జరిగిన పరిణామాలను అవలోకనం చేశారు. కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం తర్వాత సమాజం పట్ల తనకు కల్గిన ఆలోచనలు, వాస్తవ పరిస్థితులను ఓ పౌరుడిగానే కాకుండా కవిగా తాను ఏంచేయాలో నిర్ణయించుకుని ఆ దిశగా పయనించి నిజాయితి, నిబద్ధతతో కవిత్వాన్ని రాశానని ఆయన స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా పాత తెనాలి తాలూకు కారుమూరివారి పాలెంలో జన్మించిన తాను 23 వసంతాల ప్రాయంలో భాగ్యనగరానికి తరలివెళ్లి కవిత్వ ప్రమాణాలను పెంచుకోవడం ప్రారంభించానన్నారు. 5 దశాబ్దాలకు పైబడి ఎడతెగకుండా, విరామం లేకుండా కవిత్వంతో మమేకమై జీవనయానం కొనసాగిస్తున్నానన్నారు. కష్టాల్లో ఆవిర్భవించిన కవిగా ఉద్యమాలతో వికసించిన కవిగా పల్లెటూర్లు, గ్రామీణ వాతావరణం, విద్యార్థులు, యోధులు, త్యాగధనులు, స్ర్తిలు, అనాథలు, జానపద కళాకారులతో కలగలిసి, మెలసి సాహిత్యాన్ని సృజిస్తూ ఉన్నానన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ ఐరోపా, ఆఫ్రికా కవుల అధ్యయనాలు తన కవిత్వాన్ని విస్తృతం చేశాయన్నారు. అధ్యక్షత వహించిన పెనుగొండ మాట్లాడుతూ సాహిత్యలోకం గర్వించే కవుల్లో శివారెడ్డి ముఖ్యులన్నారు. మానవ సంబంధాలు కవిత్వాన్ని, జీవితాన్ని మనుషుల్ని ప్రేమించడానికి ఎంతగా దోహదం చేస్తాయో శివారెడ్డి నిరూపించారన్నారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సాహితీవేత్తలు రావెల సాంబశివరావు తదితరులు శివారెడ్డి కవిత్వ ధోరణులను ప్రస్తావించి ప్రశంసించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, అవగాహన సభ్యులు సభలో పాల్గొని శివారెడ్డి కవితాధారలో తడిసి ముద్దయ్యారు.