మిర్చియార్డు లైసెన్స్లపై రగడ
Published Friday, 29 July 2016గుంటూరు, జూలై 28: ఆసియాలోకెల్లా అతి పెద్దదయిన గుంటూరు మిర్చియార్డులో అక్రమ లైసెన్స్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో యార్డు కార్యదర్శిగా పనిచేసిన నరహరి 293 మందికి దాదాపు అప్పట్లో రెన్యువల్స్ నిలిపివేశారు. ట్రేడర్ల మధ్య ఏర్పడిన పోటీతో ఓ వర్గానికి అప్పటి కార్యదర్శి వత్తాసుపలికి మిగిలిన వారికి రెన్యువల్ను నిలిపివేశారు. ఇందులో కొంతమంది 2013-18, 2015-20 సంవత్సరానికి సంబంధించి రెన్యువల్కు నోచుకోలేదు. అయినా అప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరపక పోవడంతో ఇప్పటికీ అనధికారిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ట్రేడర్ల లెసెన్స్ రెన్యువల్లో అప్పటి కార్యదర్శి నరహరి చేతివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రేడర్లలోని ఓ వర్గం ఆయనతో భేటీ అయిన వీడియో క్లిప్పింగ్లను మీడియాకు అందజేయటంతో అసలు విషయం బయటకు పొక్కింది. నరహరి ప్రస్తుతం విజయవాడ మార్కెట్ యార్డు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మిర్చి యార్డులో మొత్తం 600 మంది ట్రేడర్ల ద్వారా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. వీరిలో సగం మందికి రెన్యువల్ నిలిపివేయటం వెనుక కూడా పెద్దఎత్తున నరహరి ముడుపులు పుచ్చుకున్నట్లు రెన్యువల్ కోల్పోయిన వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గురువారం వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మిర్చి వ్యాపారి కిలారు రోశయ్య నేతృత్వంలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు యార్డు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. నరహరి అడ్డగోలు నిబంధనల వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.