‘గాలిగోపురం నిర్మాణాన్ని నవంబర్ నాటికి పూర్తిచేయండి’
Published Friday, 29 July 2016శ్రీ కాళహస్తి, జూలై 28: గాలిగోపురం పునర్నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తిచేయాలని దేవాదాయ రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ నవయుగ నిర్మాణ సంస్థ వారిని ఆదేశించారు. సాధికారిక సర్వే ప్రత్యేక అధికారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సాయంత్రం శ్రీ కాళహస్తికి వచ్చారు. ఈసందర్భంగా ఆలయ సమీపంలో జరుగుతున్న రాజగోపురం పునర్మిర్మాణ పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత బాగుందని, నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తిచేయాలని తెలిపారు. అంతేకాకుండా చుట్టూ ప్రహరీగోడను నిర్మించి పూలమొక్కలను పెంచాలన్నారు. దీని వల్ల స్థానికులకే కాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు. ఆయనతోపాటు ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇ ఓ భ్రమరాంబ పనులను పరిశీలించారు.