బిజెపి, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా సిపిఎం బలం పెరగాలి
Published Friday, 29 July 2016ఒంగోలు, జూలై 28: దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం బలంగా పెరగాలని, ఇందుకోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో ఐదురోజులుగా జరుగుతున్న సిపిఎం రాష్ట్ర రాజకీయశిక్షణా తరగతులు గురువారంతో ముగిసాయి. చివరి రోజు తరగతుల్లో పార్టీ కార్యకర్తలు - పనివిధానంపై మాట్లాడారు. నిత్యం మారుతున్న పరిస్థితులను పార్టీ కార్యకర్తలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అనేక విధాలుగా విడిపోయి జీవిస్తున్న ప్రజలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నడపాలని పిలుపునిచ్చారు. దేశంలో సిపిఎం బలపడటం ద్వారా వామపక్ష ఐక్యత నిలబడుతుందన్నారు. మోదీ, చంద్రబాబులు రోజుకో విధానంతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లో మమేకంకావాలన్నారు. ప్రజల సమస్యలను విధానాలుగా మార్చి జిల్లాలో సిపిఎంను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ముగింపు సమావేశంలో సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ తరగతుల్లో నేర్చుకున్న కొత్త అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఐదు రోజుల తరగతులు విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని సిపిఎం జిల్లాకమిటీ తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. తరగతులకు సిపిఎం రాష్టక్రమిటీ సభ్యులు జాలా అంజయ్య ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర, కేంద్రం నాయకులు, నెల్లూరు జిల్లా కార్యదర్శి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు.