తాడిమర్రి సింగిల్విండో డైరెక్టర్ల రాజీనామా
Published Friday, 29 July 2016ధర్మవరం రూరల్, జూలై 28: తాడిమర్రి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని 7మంది డైరెక్టర్లు గురువారం రాజీనామా చేశారు. దీంతో 13మంది డైరెక్టర్లు వున్న సింగిల్విండోలో 7మంది రాజీనామా చేయడంతో సింగిల్విండో పాలకవర్గం రద్దయింది. తాడిమర్రి సింగిల్విండోకు చెందిన 7మంది డైరెక్టర్లు ధర్మవరం డివిజనల్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి శ్రీనివాసరెడ్డికి తమ రాజీనామాలను సమర్పించారు. రాజీనామాలు చేసిన అనంతరం కో ఆపరేటివ్ చట్ట ప్రకారం వారి రాజీనామాలను ఆమోదించారు. అనంతరం పాలకవర్గంలో వున్న డైరెక్టర్లు సైతం ఈ రాజీనామాల విషయాన్ని తెలుపుతూ నోటీసులు జారీ చేస్తున్నట్లు రాజీనామా చేసిన సభ్యులకు తెలిపారు. నోటీసులు జారీ చేసిన అనంతరం పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు రాజీనామాలు చేసినందున పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా వారికి తెలుపుతామన్నారు. డైరెక్టర్ల రాజీనామా అనంతరం డిఆర్ శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా పాలకవర్గం లో మెజారిటీ సభ్యులు రాజీనామా చేసినందు వల్ల పాలకవర్గం రద్దవుతుందన్నారు. అయితే నూతన పాలకవర్గాన్ని ఏ ర్పాటు చేసేందుకు అవకాశం లేనందు వల్ల కో ఆపరేటివ్ అధికారుల్లో ఒకరిని తాడిమర్రి సింగిల్విండోకు పర్సన్ ఇన్చార్జిగా నియమిస్తామని తెలిపారు.
అధ్యక్ష పదవి కోల్పోయిన భువనేశ్వర్రెడ్డి..
తాడిమర్రి సింగిల్విండో అధ్యక్షునిగా కొనసాగుతున్న భువనేశ్వర్రెడ్డి పాలకవర్గంలోని 7మంది డైరెక్టర్లు రాజీనామా చేయడంతో తన అధ్యక్ష పదవిని కోల్పోనున్నారు. 2013 జనవరిలో జరిగిన సింగిల్విండో ఎన్నికల్లో అప్పట్లో కాంగ్రెస్, టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీల మద్దతుదారులుగా బరిలోకి దిగిన డైరెక్టర్లలో 5గురు టిడిపి సభ్యులు వుండగా మిగిలిన వారు కాంగ్రెస్, వైసిపి మద్దతుదారులుగా గెలుపొందడంతో భు వనేశ్వర్రెడ్డి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారడంతో వైసిపి ఆధ్వర్యంలో సింగిల్విండో అధ్యక్ష స్థానం వుండడంతో అధికార పార్టీ నేతలు తమవైపు డైరెక్టర్లను తిప్పుకుని రాజీనామాలు చేయించినట్లు తెలుస్తోంది.
రాజీనామా చేసిన డైరెక్టర్లు వీరే..
తాడిమర్రి సింగిల్విండోలో రాజీనామా చేసిన డైరెక్టర్లు కృష్ణమనాయుడు(నారసింపల్లి), పక్కీర్రెడ్డి(శివంపల్లి), చెన్నకేశవులు(పిన్నదరి), రాగే నారాయణస్వామి(కునుకుంట్ల), శారదమ్మ( ఏకపాదంపల్లి), కుమారి(తాడిమర్రి), అశ్వర్థనారాయణ(సిసిరేవు) వున్నారు.