సమన్వయంతో సమస్యల పరిష్కారం
Published Friday, 29 July 2016ఉప్పల్, జూలై 28: స్వచ్ఛ భారత్, హైదరాబాద్లో భాగంగా ప్రధాన, కాలనీల రహదార్లలో బహిర్భూమి, మూత్ర విసర్జన చేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వివిధ శాఖల అధికారులు నిర్ణయించారు. సమన్వయంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇఇ నాగేందర్యాదవ్, ఎంఎంహెచ్ఓ కె.స్వామి, డిఇఇ హన్మంత్రెడ్డి, ఆర్.శ్రీనివాస్రెడ్డి, ఏసిపి నాగిరెడ్డి, టిపిఎస్ సురేందర్రెడ్డి, ఎలక్ట్రికల్ ఎఇఇ శ్రీనివాస్రావు, విఓ కృష్ణప్రసాద్, ఐలా కమిషనర్ కళావతి, ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, జల మండలి ఎజిఎం డేవిడ్, సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణరెడ్డి, విద్యుత్ ఎఇ రమేశ్ పాల్గొని ఆయా శాఖల పరిధిలో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.
నిరుపేదల కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు మంజూరవుతున్నాయని, ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే బోనాల జాతరకు అన్ని డివిజన్లలోని అమ్మవారి ఆలయాల వద్ద విద్యుత్ దీపాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని, పారిశుద్ధ్యంను అమలు చేయాలని తెలిపారు. ప్రధాన రహదారిలో పుట్పాత్ కబ్జాలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.
నాగోల్-హబ్సిగూడ మధ్యలో ఉన్న మెట్రో రైలు స్టేషన్ల వద్ద నిలుస్తున్న వర్షం నీటిని తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో వెటర్నరీ వైద్యులు పి.రామకృష్ణ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.