లీకేజిని బయటపెట్టిన భూపాలపల్లి గిరి రవి
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్సెట్ రాసిన వేలాది మంది విద్యార్థులను వణికిస్తున్న వ్యక్తి గిరి రవి. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రవి ఎమ్సెట్ లీకేజిని బహిర్గతం చేసి రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించారు. రవి ఒక సివిల్ ఇంజనీర్. ఆయన పశ్చిమాసియా దేశాల్లో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు చేస్తుంటారు. 47 సంవత్సరాల రవి ఏటా రెండు నెలలు ఇంటికి వచ్చి గడుపుతుంటారు. ఆయన కుమార్తె మెడికల్ ఎంట్రన్స్ ఈ ఏడాది రాశారు. పరకాలకు చెందిన కొంతమంది విద్యార్థులు రెగ్యులర్ స్టడీస్లో పెద్దగా ప్రతిభ చూపెట్టకపోయినా, ఎమ్సెట్-2లో ర్యాంకు రావడాన్ని అనుమానించిన రవి పోలీసులకు ఈ వ్యవహారాన్ని చేరవేశారు. తెలంగాణ ఎమ్సెట్-1లో 30 వేల వరకు ర్యాంకులు వచ్చిన వారికి ఎమ్సెట్-2లో వెయ్యిలోపు ర్యాంకులు రావడమే అనుమానానికి కారణమని రవి తనను కలిసిన విలేఖరులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చెప్పారు.