ప్రతిష్టాత్మకంగా నేడు వనం-మనం
Published Friday, 29 July 2016నెల్లూరు కలెక్టరేట్, జూలై 28: జిల్లా కేంద్రంలోని విఆర్సి మైదానంలో వనం-మనం కార్యక్రమ బహిరంగసభ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఈ విషయమై గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు గాంధీబొమ్మ కూడలి నుండి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. విఆర్సి మైదానంలో చెట్ల పెంపకం-వాటి ఆవశ్యకతపై బహిరంగసభ జరుగుతుందన్నారు. ర్యాలీ, బహిరంగసభల్లో మంత్రులు, ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు. సభ అనంతరం కొత్తూరు సమీపంలో ఉన్న కేంద్రీయ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో నెల్లూరు ఆర్డిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి హరిత, డిఆర్డిఎ పిడి లావణ్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.