చెత్త తరలింపు ట్రాక్టర్ల టెండర్లలో గోల్మాల్
Published Friday, 29 July 2016నెల్లూరుసిటీ, జూలై 28: నగరపాలక సంస్థ చెత్త తరలింపు ట్రాక్టర్ల టెండర్లలో గోల్మాల్ జరిగిందని, ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్కు నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ్ధర్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గురువారం కమిషనర్ ఛాంబర్లో ఇరువురు ఎమ్మెల్యేలు కలిసి ప్రజా సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్రెడ్డి మాట్లాడుతూ చెత్త తరలింపు ట్రాక్టర్ల టెండర్లను మేయర్ తన అనచరులకు కట్టబెట్టేందుకు లేని నిబంధనలు పెట్టారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెత్త తరలింపులో అసలు సీనియారిటీ అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో కమిషనర్ నీళ్లు నమిలారు. పాత సంప్రదాయం ప్రకారం టెండర్లను పిలిచామని ఎస్ఇ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే స్పందించి సంప్రదాయాలను పక్కనపెట్టి ఇకనైన ఆ టెండర్లను రద్దు చేయాలని సూచించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల డివిజన్లలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ పనులు పిలవడం లేదని, పార్టీలకతీతంగా అన్ని డివిజన్లలో సమానంగా పనులు పిలవకతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో లైటింగ్, తాగునీరు సమస్య ఉందని గతంలో ఫిర్యాదు చేశామని వాటిపై పురోగతి లేకపోతే ఇక సహించేది లేదన్నారు. సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ సబ్ప్లాన్ కింద మంజూరైన పనులను ఒక ప్యాకేజి రూపంలో పంపడం వల్ల ఆ నిధులు వెనక్కి వెళ్లాయని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి 101 జిఓ కింద మంజూరైన స్పెషల్ గ్రాంటు 30కోట్ల రూపాయల నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. అసలు ఆ నిధులు వచ్చాయో లేదా పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. సిటీ నియోజకవర్గం పరిధిలో గల డివిజన్లలో ఒక టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారమే పనులకు టెండర్లు పిలవడం మానుకోవాలన్నారు. ఇదేవిధంగా జరిగితే సిటీ నియోజవర్గ పరిధిలో ఉండే డివిజన్ ప్రజలు ఒక్క పైసా పన్ను చెల్లించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రూప్కుమార్ యాదవ్, బొబ్బలి శ్రీనివాసయాదవ్, గోగుల నాగరాజు, ఖలీల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.