విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
Published Saturday, 30 July 2016చౌటుప్పల్, జూలై 29: మండలం మందోళ్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయిచెర్వు గ్రామానికి చెందిన మహిళ రైతు ఇట్టబోయిన సుగుణమ్మ (50) వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా కిందికి వేలాడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించిన సంఘటన శుక్రవారం జరిగింది. విద్యుత్ అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా కిందికి వేలాడి ఉన్న తీగలను బిగించేందుకు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో చౌటుప్పల్లోని విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించి ధర్నా చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలలోకి వెళ్తే.... సింగరాయి చెర్వు గ్రామానికి చెందిన మహిళ రైతు ఇట్టబోయిన సుగుణమ్మ (50) తనకున్న వ్యవసాయ భూమిలో పత్తి పంటను సాగు చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో వ్యవసాయ భూమిలో ఉన్న కంప చెట్లును నరికి తీసుకువస్తుండగా కిందికి వేలాడి ప్రమాదకరంగా ఉన్న 11 కెవి విద్యుత్ తీగలకు తగిలింది. వెంటనే విద్యుత్ షాక్ గురై కిందపడి అక్కడికక్కడే మరణించింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధ్యులను కఠినంగా శిక్షించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఫోన్లో ఎఇ వీరాంజనేయులుతో మాట్లాడించారు. రూ.4లక్షల పరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. పొలీసులు కేసు నమోదు చేస్తున్నారు.